ఆ త్యాగానికి ఐదు దశాబ్దాలు
శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం యాభై ఏళ్ల సందర్భంగా...
రాజ్య నిర్బంధం-త్యాగాల పరంపర
ఈ ఏడాది అమరుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ దినం జూలై 18న శ్రీకాకుళ ఆదివాసీ, రైతాంగ సాయుధ పోరాటం యాభై ఏళ్ల సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. 1967 అక్టోబర్ 31న కోరన్న, మంగన్నల అమరత్వంతో సాయుధ మార్గాన్ని శ్రీకాకుళ పోరాటం స్వీకరించింది. 27 మే 1969న జరిగిన తొలి బూటకపు ఎన్కౌంటర్లో పంచాది కృష్ణమూర్తి, తామాడ చినబాబు, శృంగారపు నరసింహులు, దున్న గోపాల్రావు, పాపారావు, నిరంజన్రావు, రాంచంద్రప్రధాన్ అమరులయ్యారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం నుంచి ఇవ్వాల్టి దాకా దేశవ్యాప్తంగా విప్లవోద్యమంలో ప్రాణాలర్పించిన అమరులందరినీ స్మరించుకుందాం.
అమరులను స్మరించుకోవడమంటే కేవలం గుండె బరువు దించుకోవడం మాత్రమే కాదు. అద్భుతమైన మనుషులను అమానుషంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ రాజ్యహింస వ్యతిరేకతను తెలియజేయడమే. అందుకే అమరుల బంధు మిత్రుల సంఘం ప్రతి ఏటా తన ఆవిర్భావ దినమైన జూలై 18ని రాజ్యహింసకు వ్యతిరేకంగా నిర్వహిస్తోంది. ఈసారి శ్రీకాకుళ పోరాటం యాభై ఏళ్ల స్ఫూర్తితో రాజ్య నిర్బంధం-త్యాగాల పరంపర అనే అంశంపై సభను నిర్వహిస్తున్నాం.
శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం, అందులోని త్యాగం తెలుగు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. నక్సల్బరీ పంథాను బలంగా ముందుకు తీసికెళ్లడంలో శ్రీకాకుళ పోరాటం పాత్ర గణనీయంగా ఉన్నది. అందుకే నక్సల్బరీ శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటాలనే మాట భారత దేశ ప్రజా పోరాటాల చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయింది. ఒక పోరాట మార్గంగా రుజువై శ్రీకాకుళం విముక్తి ప్రాంతంగా మారుతోందనే ఆశను రగిల్చింది. అనేక కారణాల వల్ల శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం అంతులేని నష్టాలతో, రక్త తర్పణతో పూర్తిగా దెబ్బతినిపోయింది. అయినా భారత విప్లవోద్యమానికి శ్రీకాకుళం వేగుచుక్కలా నిలిచింది. శ్రీకాకుళ పోరాటం అందించిన విప్లవ ఉత్తేజం, పోరాట సంస్కృతి, త్యాగాల చాలు లేకుండా ఇవాళ దండకారణ్య విప్లవోద్యమం లేదు. ఆంధ్ర ఒడిష్షా పోరాటాలు లేవు. గత యాభై ఏళ్లుగా మధ్య, తూర్పు భారతదేశ విప్లవోద్యమాలు, పశ్చిమ కనుమల ట్రై జంక్షన్ పోరాటాలు లేవు.
అందుకే శ్రీకాకుళం పోరాటం కేవలం దెబ్బతినిపోయిన పోరాటం మాత్రమే కాదు. అదొక పోరాట పంథా. వందలాది మంది ప్రాణత్యాగలతో ఆ పోరాట మార్గం ప్రజల ఆచరణలోకి వచ్చింది. ఆ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతోంది. త్యాగం వృథాపోదు, త్యాగం లేకుండా విప్లవం రాదు.. అనే నినాదం నిజమైంది. సమాజాన్ని మౌలికంగా మార్చాలంటే కచ్చితమైన రాజకీయ పంథా ఉండాలని, దాన్ని ఆచరించే క్రమంలో ఎలాంటి త్యాగానికైనా సిద్ధం కావాలని విప్లవకారులు నిరుపిస్తున్నారు.
ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని ప్రజాస్వామిక పోరాటాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణమైన అణచివేత ప్రయోగిస్తున్నాయి. కశ్మీర్ దగ్గరి నుంచి పశ్చిమ కనుమల దాకా పోరాట ప్రాంతాలపై లక్షలాది సైన్యం యుద్ధం చేస్తోంది. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ దళితులు, ముస్లింలు, ఆదివాసుల పక్షాన నిలబడ్డ ప్రజాస్వామిక వాదులపైన కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు చేస్తున్నాయి. అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేయడమే కాక దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజాస్వామిక వాదులను, రచయితలను గత ఐదారేళ్లలో ప్రభుత్వం హత్య చేసింది. హిందుత్వ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న దళిత, బహుజన ఉద్యమకారులు, జర్నలిస్టులు, కళాకారుల అందరిపై నిత్యం దాడులు జరుగుతున్నాయి. వాళ్ల మీద కేసులు పెడుతున్నారు. హత్యాయత్నాలు చేస్తున్నారు. అయినా దేశంలో హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా, రాజ్యహింసకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అర్బన్ మావోయిస్టులనే ఆరోపణ చేసి ప్రజాస్వామికవాదులను అక్రమంగా జైళ్లలో పెట్టారు. అమరుల కుటుంబానికి కూడా చెందిన ప్రొ. సాయిబాబాకు, ఆయనతోపాటు హేమ్మిశ్రా, ప్రశాంతరాహి మరిద్దరికి చేయని నేరానికి యావజ్జీవ శిక్ష విధించారు. సాయిబాబా మహారాష్ట్రలోని నాగపూర్ జైల్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. అలాగే అమరుల కుటుంబాలకు అండగా ఉంటున్న వరవరరావును, మిగతా రాష్ట్రాల్లో అక్కడి ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు సన్నిహిత మిత్రులుగా ఉంటున్న సుధాభరద్వాజ్, ప్రొ. షోమాసేన్, వెర్నన్ గొంజాల్వేజ్, అరుణ్ ఫెరేరా, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ధావ్లే, మహేష్రౌత్లను పూణే ఎరవాడ జైల్లో నిర్బంధించారు.
ఈ మేధావుల్లో చాలా మంది పోరాటప్రాంతాల్లో అమరుల కుటుంబాలపై జరుగుతున్న రాజ్యాహింసపై మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్లు జైళ్లలో ఉన్నారు. నూతన సమాజ నిర్మాణం కోసం త్యాగం చేసిన వారి అమరత్వాన్ని కీర్తించడం మానవీయమైన విషయం. సమాజాన్ని అమానవీయంగా తయారు చేస్తున్న రాజ్యం అమరవీరుల త్యాగాలను ఎత్తిపట్టిన చేతులకు సంకెళ్లు వేస్తోంది.
ఈ పోరాటాలను ముందుకు తీసికెళ్లడంలో మహిళలు చాలా ముందు భాగాన ఉన్నారు. ముఖ్యంగా విప్లవోద్యమంలో చాలా పెద్ద ఎత్తున క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. విప్లవోద్యమంలోని అన్ని రంగాల్లో నాయకత్వ స్థానానికి ఎదిగారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం నుంచి ఎందరో మహిళలు గెరిల్లా అమ్మలుగా ఎదిగి ఆదర్శప్రాయమైన పాత్ర పోషించారు. నక్సల్బరీ పోరాటంతో ఈ ఒరవడి మరింత పెరిగింది. ఇటీవల ఎన్కౌంటర్లలో అమరులవుతున్న మహిళల్లో.. బిడ్డల్ని వదిలి విప్లవోద్యమంలోకి వెళ్లిన తల్లులు ఉన్నారు. ఆనాటి పంచాది నిర్మల మొదలు నేటి భారతక్క, కామేశ్వరిలాంటి తల్లులు వీర గెరిల్లాలుగా మారారు. వీళ్లు చేస్తున్న త్యాగాలు మొత్తంగా మహిళా విముక్తికి దారి చూపిస్తున్నాయి.
విప్లవోద్యమం, ఇతర ప్రజాపోరాటాలు అణచివేతను ఎదుర్కొంటూనే ముందుకు పురోగమిస్తున్నాయి. అయితే ఇప్పుడు కొనసాగుతున్న నిర్బంధం ఇంతకు ముందటి నిర్బంధంలాంటిది కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న ఆపరేషన్ సమాధాన్లో భాగంగా రాజ్యహింస పెరిగిపోయింది. హిందూ ఫాసిస్టు దుర్మార్గంలో భాగం ఇది. భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీలో భాగమే ఈ అణచివేత. గత ఏడాది జూలై 18 తర్వాత విశాఖ ఏజెన్సీలో భూషణం, సిడారి జమదార్ అనే ఆదివాసులు వేటకు వెళ్లితే పోలీసులు కాల్చి పంపారు. దాన్ని ఎన్కౌంటర్గా చిత్రించారు. తెలంగాణలో రాజ్కుమార్ను, ఏవోబీలో మీనా, కామేశ్వరి, బిడ్డిక లక్ష్మి, దాసు, గీత, కృష్ణను బూటకపు ఎన్కౌంటర్లలో కాల్చి చంపారు. వీరు కాక అనేకమందిని ఇతర రాష్ట్రాలలో రాజ్యం హత్య చేసింది.
ఫాసిస్టు అణచివేత చుట్టుముట్టిన సమయంలో ప్రజాసంఘాలు తమ కర్తవ్యాలను మరింత గట్టిగా నిర్దేశించుకోవాలి. ఈ అవగాహనతో ఈసారి అమరుల బంధుమిత్రుల సంఘం ఆవిర్భావ దినాన్ని శ్రీకాకుళ పోరాటం 50 ఏళ్ల సందర్భంలో అప్పటి నుంచి కొనసాగుతున్న త్యాగాల పరంపరను గుర్తు చేసుకుంటోంది. అమరులను స్మరించుకోవడం అంటే రాజ్య నిర్బంధాన్ని ఎదుర్కోవడమే. ఈ స్ఫూర్తితో నిర్వహిస్తున్న అమరుల సంస్మరణ, బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతున్నాం.
సికింద్రాబాద్, సుభాష్నగర్ అమరుల స్థూపం దగ్గర పతాక ఆవిష్కరణ, స్మరణ
అధ్యక్షత: శాంత (ఏబీఎంఎస్ ఉపాధ్యక్షురాలు),
వక్తలు: నర్సన్న, కోదండరావు (ఏబీఎంఎస్ కార్యవర్గ సభ్యులు)
అదే రోజు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా
హైదరాబాద్, బాగ్లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం హాలులో బహిరంగ సభ
రాజ్య నిర్బంధం-త్యాగాల పరంపర
అధ్యక్షత: కాకరాల (ఏబీఎంఎస్ గౌరవాధ్యక్షుడు)
అంశం: అమరత్వాన్ని ఎత్తి పట్టిన చేతులకు సంకెళ్లా?
వక్తలు: రాందేవ్, పవన
అధ్యక్షత: భవాని (ఏబీఎంఎస్ సహాయ కార్యదర్శి)
అంశం: దేశవ్యాప్తంగా మేధావులపై అణచివేత
వక్త: ప్రొ. హరగోపాల్
అంశం: పోరాట ప్రాంతాలపై అణచివేత
వక్త: ప్రొ.లక్ష్మణ్
అంశం: గెరిల్లా తల్లుల పోరాటం-త్యాగం
వక్త: పద్మకుమారి
అధ్యక్షత: అంజమ్మ (ఏబీఎంఎస్ అధ్యక్షురాలు)
అంశం: యాభై వసంతాల త్యాగాల పరంపర
వక్త: ప్రొ. కాశీం
అంశం: విప్లవోద్యమంలో మహిళల పాత్ర
వక్త: వరలక్ష్మి
అంశం: ఫాసిస్టు అణచివేత-కర్తవ్యాలు
వక్త: పాణి
ప్రజాకళామండలి, డప్పు రమేష్ బృందం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
Type in English and Press Space to Convert in Telugu |
ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్రకార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ... |