కరోనా వైరస్ కలవరం ప్రపంచాన్ని చుట్టుముట్టకముందు జలుబు పెద్ద విషయమేం కాదు. ఇప్పుడది మహా ప్రాణాంతకం. పక్క వ్యక్తికి మన ఉనికిని తెలపడానికి చేసే పొడి దగ్గు సంజ్ఞ ఆ వైరస్ వచ్చిందనేందుకు సంకేతమట!. ఈ ముళ్ల కిరీటం (కరోనాకు ఇంగ్లిష్ అర్థం) పెట్టుకొని కూర్చొన్న ప్రపంచంలో జలుబు లాగే, దగ్గులాగే ఒకనాడు మామూలుగా అనిపించిన చాలా విషయాలు తక్షణ, అనివార్య చర్చను డిమాండ్ చేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య ఆయిల్ ఆధిపత్య ఉద్రిక్తతలు దశాబ్దాలుగా ఉన్నవే. కానీ, ఇరాన్ సైనిక కమాండర్ సులేమానీ హత్యకు ఆ దేశం అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని ఈసారి ఎందుకనో సామ్రాజ్యవాద పీడిత ప్రపంచమంతా బలంగా కోరుకొంది. దాదాపు జైళ్లలో ఉన్న ఈ ప్రపంచం ఇరాన్ తీసుకొనే చర్యతో తనకు ఊపిరి తీసుకొనే వ్యవధి దొరుకుతుందని భావించింది. కానీ అలా జరగలేదు. మనదేశంలో ఉపా వంటి స్టేట్ టెర్రరిస్టు చట్టాలతో సమానంగా, ఒక్కోసారి అంతకుమించి కూడా సెక్షన్ 144 తన ప్రతాపం చూపుతోంది. తెలుగు ప్రజల పోరాట క్రమాలకు పెద్ద అడ్డుకట్ట కాని ఈ సెక్షన్కు వాస్తవంలో రాజ్యాంగంలోని అన్ని ప్రాథమిక హక్కుల నిబంధనలను తుడిచిపెట్టే శక్తి ఉన్నది. కశ్మీర్లకు ఏనాడో అనుభవంలోకి వచ్చేసిన దీని కోరలు మనకు మాత్రమే కొత్త! అలాగే యూనివర్సిటీల్లోని అన్టచ్బులిటీని ప్రశ్నించడమూ, విప్లవ రచన చేసినందుకు, సామాజిక విప్లవం కోరుతూ మాట్లాడినందుకు జరిగే అరెస్టులూ సహజమేననే పరిస్థితీ లేదు. ప్రతి అరెస్టూ మహాకుట్రల పరంపరలకు తెర తీస్తోంది. తెలంగాణలో ఇలాంటి సన్నివేశమే ప్రజాస్వామ్య, ప్రగతిశీల, విప్లవ భావజాల సంస్థలను, వాటి నాయకులను; పత్రికలను, వాటి సంపాదకులను కబళించివేస్తోంది! విరసం కార్యదర్శి, నడుస్తున్న తెలంగాణ సంపాదకుడు, ఓయూ ప్రొఫెసర్ కాశీం అరెస్టు ఈ క్రమాన్ని మరింత వేగవంతం చేసింది.
ʹʹసామాజిక వివక్షను అమలుచేయడానికి ప్రైవేటు విద్యావిధానాన్ని మించిన అస్త్రం లేదుʹʹ అని లాటిన్ అమెరికా రచయిత గాబ్రియెలా గార్షియా మార్వేజ్ అంటారు. దక్షిణాఫ్రికా నేతలతో జరిపిన సంభాషనలో ఆయన ఈ మాట అన్నారు. కెన్యా ప్రవాసి ప్రొఫెసర్ గూగీ వాథియెంగో ʹఆన్ కల్చర్ʹ వ్యాసాలు చదివినవారికి, ఈ వివక్ష ఎన్నెన్నిరూపాల్లో విద్యావ్యవస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నదనేది తేలిగ్గా అర్థమవుతుంది. ఆఫ్రికా సందర్భంలో వివక్షగా అమలయిన వ్యవస్థ దుర్మార్గం.. మనదేశ పరిస్థితుల్లో సామాజిక అంటరానితనంగా అన్ని వ్యవస్థల చేవను నీరుగార్చేస్తోంది. ʹప్రపంచ బ్యాంకు ప్రాయోజిత అభివృద్ధి నమూనాలో విధ్వంసమైన ముఖ్య రంగం విద్యనే. ఇవాల్టీ ప్రైవేటు, విదేశీ విశ్వవిద్యాలయాలకు కావాల్సిన ప్రాతిపదిక ఆనాడే పడిందిʹ అని మరో ప్రొఫెసర్ కాశీం ఈ ఆర్థంలోనే రాశారు. ʹఅకడమిక్ అన్టచ్బులిటీʹ అనే వ్యాసాల సంపుటిలోని తొలి వ్యాసం ʹఇంటలెక్చువల్ అన్టచ్బులిటీʹలో ఆయన ఈ మాట రాశారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో అంటరానితనం పాలక విధానంగా అమలవుతూ, ఆ విధానంలో యూనివర్సిటీ పాలకమండళ్లు, టీచర్ సంఘాలు భాగస్వాములు అవుతున్నారని, చదువుకోవాలన్న ఎస్సీ,ఎస్టీ, బీసీల కోరికను చిదిమేస్తున్నారని ఆయన విశ్లేషించారు. వీరిని బ్రాహ్మణీయ హిందూత్వ పెత్తనం కింద శాశ్వతంగా ఉంచేస్తున్న కుట్రను ఛేదించడానికి కాశీం ఈ పుస్తకంలో ప్రయత్నించారు. పైకి మనకు కనిపించే పొదిలి అప్పారావు ఒక్కడేనని, కాషాయీకరణ మనువాద సాంస్కృతిక ఎజెండాలో కనిపించకుండా దాగిన అప్పారావులు వేనవేలమంది ఉన్నారని తేల్చేశారు. ఆయన సంపాదకుడుగా ఉన్న నడుస్తున్న తెలంగాణలో ఇందులోని 20 వ్యాసాలు ప్రచురించి, యాభై ఏళ్ల విరసం మహాసభల్లో పుస్తకంగా ఆయన తెచ్చారు. ఇదే సభల్లో ఆయన విరసం కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సభలు జనవరి 11,12 తేదీల్లో జరిగితే వారం తిరక్కుండానే జనవరి 18వ తేదీన ఆయన ఇంటిపై దాడి చేసి, భార్యబిడ్డల సమక్షంలోనే బీభత్సం సృష్టించి కాశీంను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టును తెలంగాణ పౌరహక్కుల సంఘం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ చౌహాన్ ఎదుట చేసిన వాదనల్లో ʹఅకడమిక్ అన్టచ్బులిటీʹ ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ పుస్తకం రాసి, ప్రచురించిన సమయాన్ని ఆయన అరెస్టునకు పోలీసులు ఎంచుకోవడాన్ని కోర్టు దృష్టికి తెచ్చింది. ఏడాదికాలానిపైగా దేశమంతటా, రెండు నెలలుగా ఒక పరంపరగా తెలంగాణలో ప్రజాసంఘాలు, మహిళా సంఘాల కార్యకర్తలు, నాయకుల అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఒక అరెస్టు వెనుక అన్టచ్బులిటీ కోణం చర్చకు రావడం మాత్రమే కాశీం నిర్బంధంలోనే చూస్తున్నాం. తాను పనిచేస్తున్న యూనివర్సిటీలో అకడమిక్ అంటరానితనాన్ని ప్రశ్నించడం సహించలేని ప్రభుత్వంలోని, ఆ యూనివర్సిటీలోని బలమైన శక్తులే కాశీంను అరెస్టు చేయించాయని సీఎల్సీ స్పష్టంగానే ఆరోపించింది. నిజానికి, ఈ శక్తులతో నిండిపోయిన రాజ్యాంగ వ్యవస్థలు, ఉన్నత విద్యాలయాల్లో కనీస ప్రజాస్వామ్యం, ప్రజానుకూల వైఖరి కోసమే కాశీం వంటి విద్యాధికులు మూడు దశాబ్దాలుగా తపిస్తున్నారు. దానికోసం రిజర్వేషన్ వ్యతిరేక ధోరణులను ఎదుర్కొంటున్నారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం వాదిస్తున్నారు. పూలే,అంబేడ్కర్ ప్రాసంగికతపై చర్చను సజీవంగా ఉంచుతున్నారు. తెలంగాణ కోసం గొంతెత్తి తమ భాగస్వామ్యంతో ప్రాంత ఆకాంక్షలకు సంపూర్ణ ఉద్యమ రూపును తెచ్చారు. కుటుంబంలో తొలి విద్యాధితుడైన కాశీం మొదలు దాదాపు ఇలాంటి నేపథ్యమే కలిగిన అనేకమంది దళిత విద్యావంతులు ఎంతో తపనతో సామాజిక చలనాలు విసిరే సవాళ్లకు స్పందిస్తున్నారు. అయితే ఇది వట్టి తపన కాదు. అలాగని కాశీం ఒక్కడి కొట్లాటే కాదు. సామాజిక మార్పును కోరే శక్తులు తక్షణం, అనివార్యంగా వేయాల్సిన అడుగు అది. కాబట్టే కాశీం ఈ మార్పు కోసం గొంతెత్తాడు. విరసంలో చేరి మార్క్సిస్టు ఆలోచనతో సామాజిక ఆచరణలో భాగమయ్యాడు. ఆ ఆచరణ తనను జైలుదాకా తీసుకెళుతుందని తెలిసీ అందుకు సిద్ధపడ్డారు. మార్పును కోరుకొనే సమాజం దాన్ని సాధించే శక్తులను తానే తయారుచేసుకొంటుంది. అలా రూపుదిద్దుకొంటున్న విలువైన వ్యక్తిత్వాలు, మంచి మనుషులు ఈనాడు అరెస్టులవుతూ, జైళ్లలో కుట్ర కేసులను ఎదుర్కొంటున్నారు.
ప్రపంచానికి పట్టిన కరోనా పడిశం ఒకనాటికి వదిలిపోతుంది. కానీ, ఆ వైరస్ను గాలిలోకి స్రవిస్తున్నాయంటూ అప్పటికి ఎన్ని లక్షల గబ్బిలాలు, పాములు వధకు గురవుతాయో కదా! ఒకనాటికి సామ్రాజ్యవాద పీడిత ప్రపంచం అమెరికాపై ప్రతీకారం తీర్చుకొంటుంది. అవసరమైతే యుద్ధమూ చేస్తుంది. అభివృద్ధి చెందిన ఉత్పత్తి శక్తులను నిర్జించడానికి సామ్రాజ్యవాదులు జరిపే యుద్ధం లాంటిది కాదిది. పరిపక్వమైన ఉత్పత్తి శక్తులు.. తమను నాశనం చేసే అవకాశం సామ్రాజ్యవాదులకు ఇవ్వకుండా తామే సాగించే యుద్ధం. అది ప్రజాయుద్ధం. అయితే, ఈ యుద్ధం ప్రపంచాన్ని ముంచెత్తేనాటికి భారత్ సహా మరెంత పీడిత జన ప్రాంతం జైళ్లుగా మారుతుందో కదా! కుట్రలను ఛేదించుకొని ఒకనాటికి మన నేతలు ప్రజలను తప్పక చేరతారు. కానీ, అప్పటికి స్వేచ్ఛాచైతన్య ధారలు ఎన్ని ఇగిరి, ఎంత అమృతం చిక్కబడుతుందో కదా! జైళ్లకు పోయినవారు పోగా, మిగిలిపోయినవారి కర్తవ్యం ఏమిటి? మనిషి ధ్వంసమవుతాడేగానీ ఓడిపోడనే నిశ్చయానికీ, మనిషి నశించడుగాక నశించడు అనే శాస్త్రీయ చారిత్రక ఆశాభావానికీ మనమంతా పదును పెట్టుకోవాల్సిన తరుణమిదే!
Type in English and Press Space to Convert in Telugu |
మంద్రస్థాయి యుద్ధం - ప్రజా ప్రతిఘటన : రివేరా9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో మంద్రస్థాయి యుద్ధం - ప్రజా ప్రతిఘటన పై రివేరా ఉపన్యాసం....... |
చేజారిన జాడల్లోంచి మైదానాల్లోకి..పుస్తకాల సంచిని గిరాటేసి
రోడ్డుపైకి దూసుకెళ్లిన జ్ఞాపకం
వెనుక నుంచి పిలుస్తున్న తల్లివైపు
స్నేహితుల భుజాలపైనుంచి
నవ్వుతూ చూడటమే చివరిచూపు....... |
ఏప్రిల్ పండు II రివేరాపిల్లలు లేని ఇల్లు, ఇది హైదరాబాద్, ఊరేగింపు, ఏప్రిల్ పండు,... |
సాయంకాలం వాన!దుప్పటి కింద, దిండు అడుగున
పిల్లలు చూడకుంటా కప్పెట్టుకొన్న
వరదగూడుని మెలిపెడతావేమో... |
సబ్కా జవాబ్ వెతికుతున్న కవి రివేరావిప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే....... |
రెప్పని కప్పని నిద్దురఒకే రాత్రిని కప్పుకొన్న మనకి
ఒక్క నిద్దుర చాలదా?
చుక్క కలని పొదువుకోడానికి
ఈ ఒక్క దేహ వర్షం చిలకదా?... |
భయం చుట్టూ భయం..వీళ్లెక్కడ చంపుకుతింటారోనని ఆడవాళ్లకు భయం
భయంలేని ఆడవాళ్లంటే మగవాళ్లకు మహా భయం
దొంగలంటే భయం, పోలీసులన్నా మరి భయమే
తాళాలు లేని తలుపులంటే భ... |
ఈ రాక్షస గీతి వింటారా?మనం నిలబడిపోయిన చోట నుంచే
మన నడకలను మోసుకెళుతున్నారు
మనం ఆపేసిన రాగాలనే
తీగలుగా సాగిపోతున్నారు
మన గొంతునీ, మన వంతునీ
మనక్కిచ్చేసి వెళుతు... |
నో, ఐ డోన్ట్ లైక్ టమాటటమాట రంగు సరే,
రసాలూరే సరస్సులేమీ..
కొంచెం కరిచిపట్టుకొన్న
మిలమిలా మీనాలేమీ..
పైకి కిందకి మునకలేసే
గత్తరబిత్తర గోళాలేమీ....... |
అద్గదీ...అటో ఇటో వేటో పోటో పడిపోవాల్సిందే!
పాలకులంతా ప్రజాస్వామికవాదులై
ప్రజలేమో నియంతలైతే ఏమి చేస్తాం?... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |