మనం వాకపల్లిని మర్చిపోలేదు. అందుకే అప్పుడే పదేళ్లా అని ఉలిక్కి పడ్డాం. బాధిత మహిళలు నిన్న మొన్నే నగరం మధ్యలోకి వచ్చి ఆందోళన చేసినట్లనిపిస్తోంది. ఈ జనారణ్యంలో వేటగాళ్ల కంటపడ్డ లేడి పిల్లల్లాగా, నీళ్లలో తడిసిన పూరేడు పిట్టల్లా ఒదిగి ఒదిగి ʹనాగరికుల్నిʹ చూస్తున్న దృశ్యం ఇంకా కదిలాడుతోంది.
ఈ పదేళ్లలో వాళ్లు ఏపాటి న్యాయం పొందారో మనకు తెలుసు. ఎంతో శ్రమకోర్చి చేసిన పోరాటం ఫలితంగా కంటి తుడుపుగా కేసు నమోదు చేశారు. పాడేరు కోర్టులో కేసు నడపాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీని మీద పోలీసులు సుప్రీం కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇవాళ అదే అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో స్పందిస్తూ కేసు విచారణలో ఇంత జాప్యం ఏమిటని ప్రశ్నించింది. వెంటనే నిందితుల్ని విచారించాలని ఆదేశించింది.
అయితే ఈ పదేళ్ల కాలంలో వాకపల్లి చెల్లించిన మూల్యం అంతా ఇంత కాదు. ఒక వైపు నిందితులైన పోలీసులు పదోన్నతి పొందుతూ అందలాలు ఎక్కుతోంటే, మరో వైపు వాకపల్లి గ్రామస్థులు ప్రభుత్వంతో పోరాడుతున్నందుకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఏదైనా అవసరాలకు బైటికి వెళ్లాలంటే మళ్లీ తిరిగి వస్తామన్న ఆశ ఆ గ్రామస్థులకు లేదు. మావోయిస్టులకు సహరిస్తున్నారనో, మావోయిస్టుల్లో చేరిపోయారనో కేసులు నమోదవుతాయి. మగవాళ్లను అరెస్టు చేసి కేసు వెనక్కి తీసుకోవాలని, లేకుంటే నక్సలైట్ల పేరుతో చంపేస్తామని, జైల్లో పెడతామని పోలీసులు నిత్యం బెదిరిస్తుంటారు. వాకపల్లి గ్రామంలో కేసుల్లో ఇరుక్కున్న వాళ్లంతా అత్యాచార బాధితుల అన్నదమ్ములు, బంధువులు. వాకపల్లి మహిళలు సంతలకు వెళ్లడం మానేసి చాలా కాలం అయింది. పిల్లలను చదివించాలంటే ఊళ్లో ఐదో తరగతి వరకే బడి ఉంది. అందులో టీచర్లు లేరు. బైటికి పంపాలంటే అభద్రత. ఎందుకంటే రాజ్యం వాళ్లపై కక్ష కట్టింది కదా? ప్రాణాలు అరచేత పట్టుకొని చదివిద్దామనుకున్నా సర్టిఫికెట్లకు జి. మాడుగుల వెళ్లాల్సిందే. అక్కడికి వెళితే పోలీసుల వేధింపులు అనుభవించాల్సిందే. ఆ గ్రామానికి వెళ్లడానికే ఇతర ఊళ్ల వాళ్లు భయపడే పరిస్థితి. ఇది ఇలా ఉంటే పోలీసుల నిర్బంధం నీడలో ఉన్న ఈ గ్రామంతో వివాహ సంబంధాలు కలుపుకోడానికి కూడా ఇతర గ్రామాల వారు భయపడుతున్నారు.
ఇన్ని వేధింపుల మధ్య కూడా ఈ పదేళ్లుగా వాళ్ల పోరాటం ఆగలేదు. బాధిత మహిళలు మడమ తిప్పలేదు. ప్రభుత్వం, పోలీసులు అదిరించి బెదిరించి అలిసిపోయారు. ఉద్యోగాలు, డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. ఎన్ని వేషాలు వేసినప్పటికీ వాళ్ల న్యాయ పోరాటం ముందు ఓడిపోయారు. ధన బలం, అధికార మదం ఏవీ వాళ్లను లొంగదీసుకోలేకపోయాయి. పిడికెడు మంది వాకపల్లి ప్రజలు రాజ్యాన్ని చికాకుపరుస్తున్నారు. ఈ రోజు వాకపల్లి ఒక పోరాట కేంద్రం. ఆ పోరాటానికి న్యాయ వ్యవస్థ తలవంచక తప్పని స్థితి. అంత మాత్రాన ఏదో న్యాయం జరుగుతుందని కాదు. కానీ ఇది వాకపల్లి విజయమే.
ఆదివాసులకు ఈ కోర్టులు, రాజ్యాంగం వంటివి ఏమీ తెలియకపోవచ్చు. కానీ వాకపల్లి దుర్మార్గం మన సమాజ దుస్థితికి నిదర్శనం. అందువల్ల సమాజం నుంచి వాళ్లకు బుద్ధిజీవుల మద్దతు లభించింది. దీంతో సుప్రీం కోర్టు స్పందించాల్సి వచ్చింది.
ఒక కులాన్ని అవమానపరచాలనుకుంటే ఆ కులం మహిళలపై అత్యాచారం చేస్తారు. మైనార్టీ మతస్థులపై దమనకాండకు పాల్పడాలంటే ఆ మతం మహిళల గర్భాలను శూలాలకు ఎర వేస్తారు. వ్యక్తిగత ద్వేషాలను చాటుకోడానికి కూడా మహిళల శరీరాలు, వాళ్ల ఆత్మగౌరవమే లక్ష్యమవుతాయి. ఒక పోరాటాన్ని దెబ్బతీయాంటే ఆ పోరాటంలో భాగమైన మహిళల శరీరాలపై దాడులు జరుగుతాయి. అంగాంగాలు ఖండించబడుతున్నాయి. రాజ్యమే కుట్రపూరితంగా, వ్యూహాత్మకంగా పోరాట మహిళల శరీరాలను లక్ష్యంగా చేసుకొని అత్యాచారాలకు పోలీసులను, సైన్యాన్ని పురికొల్పుతోంది. జాతి ఉద్యమాల్లో, విప్లవోద్యమాల్లో లెక్కలేనంత లైంగిక హింస జరుగుతోంది. అనేక రోజులు పోలీసు క్యాంపుల్లో అత్యాచారాలకు గురవుతున్నారు. వారి శరీరాలను వేటాడి వెంటాడి పాశవికంగా, అతి హేయంగా ఛిద్రం చేస్తున్నందుకు పోలీసులకు ప్రభుత్వం అవార్డులు, ప్రమోషన్లు ఇస్తోంది.
ఇదంతా పాలకుల రాజనీతి. దీన్ని వాకపల్లి మహిళలు పదేళ్లుగా ఈ ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఈ రాజనీతిని ప్రతిఘటిస్తున్నారు. వాళ్లు కోరుకుంటున్న న్యాయం.. తమ గూడేలపైన పోలీసుల ఉక్కు పాదాలు మోపకూడదని. తమను నిర్వాసితులను చేసేందుకు కుట్రపూరితంగా సాగుతున్న మానవ హననాన్ని ఆపివేయాలని.
ఈ పోరాటం వల్ల నేరుగా ఏం సాధించారంటే .. ఆదివాసీ ప్రాంతాల్లో గనులు తొవ్వకాన్ని ఎదుర్కొంటున్నారు. ఆ ఈ అడవిపై హక్కు తమదే అని చాటుకుంటున్నారు. వేలాది సైన్యాన్ని, పోలీసులను మోహరించినా, అనేక మందిని చంపేసినా అక్కడ ప్రజా ఉద్యమం కొనసాగుతున్నది. అందు వల్లే ఇన్నేళ్లుగా ప్రభుత్వ కుట్ర ఫలించడం లేదు.
అయితే వాకపల్లి ఒక్కటే కాదు. విప్లవోద్యమ ప్రాంతాల్లో మహిళల రాజ్యం దారుణంగా దాడి చేస్తోంది. బైటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించీ వింటున్నాం. చిన్న పిల్ల దగ్గరి నుంచి అరవై ఏళ్ల ముసలమ్మ వరకు అత్యాచారాలకు గురవుతున్నారు. ఇందులో కొన్ని క్షణికావేశంలో కామోద్రేకంతో జరిగేవైతే చాలా వరకు రాజ్యం ప్రేరేపిస్తున్నవే. ఈ హింసను ప్రతిఘటిస్తున్నందుకు అనేక మంది సామాజిక కార్యకర్తల మీద కూడా దమనకాండ జరుగుతోంది. చత్తీస్గఢ్ తమ జాతి మహిళలపై జరుగుతున్న ఇలాంటి హింసను ప్రశ్నించినందుకే సోనిసోరీపై దారుణమైన శారీరక హింస, జైలు హింస, యాసిడ్ దాడి కూడా జరిగాయి. అనేక సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. వీటిని ప్రతిఘటిస్తున్నందుకు క్రాంతికారీ మహిళా కామ్రేడ్స్పైన, గ్రామ మిలీషియా మహిళలపైన అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి.
విషాదాన్ని, నిర్బంధాన్ని అనుభవిస్తున్న వాకపల్లి అమరత్వ వారసత్వాన్ని కూడా అందిపుచ్చుకుంది. అందుకే కా. దానియెల్ (దాసూరాం) విప్లవోద్యమంలోకి వెళ్లి రాంగుడా మారణకాండలో అమరుడయ్యాడు. ఆ తర్వాత ఆయన కుటుంబం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి హైదరాబాదు వచ్చినప్పుడు ఆయన తండ్రి మాట్లాడుతూ ʹవాకపల్లి ఘటనలో మాకు న్యాయం జరగకపోగా మాపైన తీవ్రమైన నిర్బంధం కొనసాగుతోంది. దీన్ని ఎదిరించి నా కొడుకు పోరుబాట పట్టాడు..ʹ అని అన్నాడు. దాసూరాం తల్లి మాట్లాడుతూ ʹమా ఊరి ఆడవాళ్లకు చాలా కోపం ఉంది. న్యాయం జరుగుతుందనే ఆశ సన్నగిల్లింది. అయితే మేమంతా ఇక్కడే ఉంటే నా బిడ్డ పార్టీలోకి వెళ్లి ప్రాణం ఇచ్చాడు. మేమంతా అతడి గుర్తుగా స్థూపం కట్టుకున్నాం. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు మేం పోలీసులకు భయపడి చెల్లాచెదరు కాలేదు. గ్రామమంతా కలిసి ఎదిరించాం. స్థూపానికి ఎర్రరంగు వేయవద్దని అన్నారు. రంగు డబ్బాలు తెచ్చుకోడానికి వీల్లేకుండా అడ్డుకున్నారు. రంగు తెచ్చుకోనివ్వకపోతే మా రక్తంతో రంగు వేస్తామని అన్నాం. పోలీసులు వెనుదిరిగారు. ఇది మా విజయం.. ʹ అంది. వాళ్లకు లాల్ సలాం.
Type in English and Press Space to Convert in Telugu |
ఆ శిరస్సు, స్తనాలు ఏమయ్యాయి?మర్మాంగాలను ఛిద్రం చేస్తున్న చోట, పాలిచ్చే వక్షోజాలను కోసి పారేస్తున్న చోట, తలెత్తి పోరాడమని ప్రజలకు నేర్పిస్తున్న వాళ్ల తలలు మాయం చేస్తున్నచోట, శవాన్ని ప... |
మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..వాకపల్లి పాతపడిపోయింది. కొత్తగా భల్లుగూడ కూడా మన ముందుకు వచ్చిపోయింది. ఛత్తీస్ఘడ్లో రోజూ ఇలాంటి అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. అన్నీ పోలీసులు, పారా........ |
ఉండవలసిన తీరుʹఅమ్మా నువ్వే ఇట్లన్నవంటే.. వాల్లు ఇంకెట్లంటరో ఆలోచించు. అది చూడు ఎంత బాధపడుతున్నదో. ఇంతకూ బాబును వదిలి వెళ్లడానికి ధనాలు సిద్ధంగా ఉందా? దాన్ని ఒక్క మాట అడగ... |
పయనించిన పాటబిడ్డల గురించి తల్లులకు ఇలాంటివి ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని ఆరాటాలు, ఎన్ని ఎదురు చూపులు. ఇవి తీరేవేనా? ఈ దు:ఖం ఆగిపోయేదేనా? ప్రభా తల్లి ఒక్కరే కాదు. అమరుల ... |
ఉండవలసిన తీరు -2కమాండర్ వెనక్కి తిరిగి మనం దగ్గరికి వచ్చేశాం. ఇది మనకు బలమైన ప్రాంతం. ఇంకో అరగంటలో గ్రామం అంచులోకి చేరుకుంటాం. ప్రయాణం ఒక రోజు లేటైనా రెండో రోజు ఏపీటీకి... |
విప్లవ వ్యక్తిత్వంభారతి అమరత్వం తర్వాత కలిసినప్పుడు శంకరన్న వాళ్లన్నయ్య దుబాషి యాదయ్య తన జ్ఞాపకాలు పంచుకున్నాడు. చిన్నారి యాదమ్మ ఆ కుటుంబంలో హక్కుల కోసం ఆమె పడిన ఘర్షణ...... |
పాల్గుణఇప్పుడు పాల్గుణ అంటే మేఘమే కురుస్తుంది తప్ప పిడుగు రాలదు.పిడుగు రాలినా పిడుగంచు విద్యుత్ వెలుగై మనసులోకి ఇంకుతుంది. ... |
త్యాగాల పరంపర కుప్పగా పోసిన శవాల్లో తమవాళ్లను గుర్తించి ఏరుకోవడం ఎంత హృదయ విదారకం. సృజన మనసు చాల సున్నితమైనది. పట్టుదలగల అమ్మాయి. మేము ఇలా ఎప్పుడో ఒకప్పుడు చూస్తామని...... |
దారులుఎక్కడివీ బాటలు
ఎవరి జాడలు వెంట పరిగెడుతున్నాయి
నీవేనా ? అవి నీవేనా ?... |
రమాకాంత్ వాళ్లమ్మ ʹఆ రోజు అన్నను చంపేసినప్పుడు మన సంగం లేదు కాబట్టి శవాన్ని చూడ్డానికి కూడా కాలేదు. ఇప్పుడు ఎక్కడెక్కడికోపోయి మనోల్ల శవాలను తెస్తున్నారు. మన సంగం ఉండాలి ..... |
ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్రకార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ... |